Banjara Hills: అక్కినేని సినిమా విడుదల పేరుతో మోసం చేశారని నిర్మాత ఫిర్యాదు

13 Nov, 2022 17:04 IST|Sakshi
ఏఎన్నార్, జయసుధ నటించిన ప్రతిబింబాలు, నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి

సాక్షి, హైదరాబాద్‌: ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా ప్రతిబింబాలు పేరుతో తాను నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ రూ.13 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ సినీ నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయం చర్చించేందుకు తాను రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణలకు ఫోన్‌ చేయగా వారు అందుబాటులోకి రాలేదన్నారు. వారి డ్రైవర్‌ బాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనను దుర్భాషలాడారన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల విషయంలో, తన వద్ద తీసుకున్న డబ్బుల విషయంలో ప్రశ్నించినందుకు తనను బెదిరించారని, కత్తి తీసుకొని పొడిచేందుకు ప్రయత్నించారని వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కుర్చీలో నుంచి కిందపడేసి గాయపరిచారన్నారు. బలవంతంగా తన ఆఫీస్‌లోని పెన్‌ డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు తీసుకొని వెళ్లారని వాటిని తిరిగి ఇవ్వలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సినీ నిర్మాత జె.రాధాకృష్ణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ, డ్రైవర్‌ బాలుపై ఐపీసీ సెక్షన్‌ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు