నేనెక్కడున్నా మీ వాడినే 

16 Aug, 2022 10:51 IST|Sakshi

ప్రభాస్‌ ‘సలార్‌’ తర్వాత జూ.ఎన్టీఆర్‌తో సినిమా 

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌

మడకశిర రూరల్‌(శ్రీసత్యసాయి జిల్లా):  ‘నేనెక్కడున్నా మీ వాడినే. నా పేరులోని ‘నీల్‌’ అంటే నీలకంఠాపురమే. ఇదే నా స్వగ్రామం. ఎక్కడున్నా మరచిపోను. నా చివరి మజిలీ తప్పకుండా నీలకంఠాపురమే ఉంటుంది’ అని కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ భావోద్వేగంతో వెల్లడించారు. సోమవారం ఆయన తన చిన్నాన్న, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి నీలంకంఠాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. 

స్వాతంత్య్ర దినోత్సవం, తన తండ్రి జన్మదిన దినోత్సవం ఒకే రోజు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. అనంతరం నీలకంఠేశ్వరస్వామి దేవాలయ సముదాయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా తన తండ్రి సుభాష్‌ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఎల్‌వీ ప్రసాద్‌ కంటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి సహకారంతో ఈ ప్రాంతంలోని వారికి వైద్యసేవలందించేందుకు సహకారం అందిస్తామన్నారు.  

త్వరలోనే ఎన్టీఆర్‌తో సినిమా 
ప్రసుత్తం ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని, రానున్న ఏప్రిల్, లేదా మే నెలల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో మరో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్‌ నీల్‌ వెల్లడించారు. కార్యక్రమంలో రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు