Kangana Ranaut: ఆ సంఘటన తర్వాత ఎవరైన నా పక్కన వస్తుంటే భయమేస్తోంది

20 Dec, 2022 10:22 IST|Sakshi

యువతులపై యాసిడ్‌ దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీంతో నటి కంగనా రనౌత్‌కు యాసిడ్‌ భయం పట్టుకుంది. బాలీవుడ్‌తో పాటు తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లో నటిస్తూ సంచలన నటిగా ముద్ర వేసుకున్న కంగనా రనౌత్‌  తాజాగా తమిళంలో చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.

అయితే ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అయినా తమ జీవితంలో జరిగిన భయంకర సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూనే ఉంటాయి. నటి కంగనా రనౌత్‌ అందుకు అతీతం కాదు. ఈమె తన కుటుంబంలో జరిగిన యాసిడ్‌ దాడి గురించి తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంటూ తన సోదరి మాదిరిగానే తనపైనా యాసిడ్‌ దాడి జరుగుతుందేమోనని భయపడుతున్నట్లు పేర్కొంది.

తన సోదరి రంగోలి యాసిడ్‌ దాడికి గురైందని, ఆమెకు 52 శస్త్ర చికిత్సలు జరిగినట్లు గుర్తు చేసింది. ఆ సంఘటనలో తన సోదరి శారీరకంగా, మానసికంగా ఎంతో బాధింపునకు గురైందని చెప్పింది. ఆ సంఘటన తర్వాత తనపై కూడా యాసిడ్‌ దాడి జరుగుతుందేమేనని ప్రతిక్షణం భయపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఎవరైనా తన పక్కన వస్తుంటే ముఖం దాచుకుంటున్నానని తెలిపింది.
  

మరిన్ని వార్తలు