చనిపోతా.. రేపో, ఎల్లుండో చితికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్‌ ఎమోషనల్‌

12 Jan, 2022 15:13 IST|Sakshi

గత మూడున్నర దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్‌ హీరో రాజశేఖర్‌. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించాడు కానీ.. ఒకప్పుడు రాజశేఖర్‌ సినిమా అంటే.. మినిమమ్‌ గ్యారెంటీ ఉండేది. అంతేకాదు 90ల్లో స్టార్‌ హీరోగా వెలుగొందాడు. అప్పట్లో రాజశేఖర్‌ ఖాతాలో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. చాలా గ్యాప్‌ తర్వాత ఈ యాంగ్రీ స్టార్‌ ‘శేఖర్‌’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్నా రాజశేఖర్‌.. తన జీవితంలో అనుభవించిన అత్యంత గడ్డు కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

గతేడాది కరోనా బారిన రాజశేఖర్‌.. నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కరోనా సోకినప్పుడు నాకు చాలా సీరియస్‌ అయింది. ఇక నేను చనిపోతాననుకున్నా. రేపో ఎల్లుండో నా చితికి మంట పెడతారనే ఆలోచనలు వచ్చాయి. జీవిత, పిల్లలకు ధైర్యంగా ఉండాలని చెప్పా. ప్రేక్షకుల ప్రార్థనల వల్లే బతికాను. ఇంటికి వచ్చిన తర్వాత నా కాళ్లు, చేతులు పనిచేయలేదు. ఇక నేను నటించలేనేమో అనే భయం కలిగింది. నాపై నాకే నమ్మకం లేకపోవడంతో..‘శేఖర్‌’చిత్రాన్ని వేరేవాళ్లతో చేయమని చెప్పా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే అవన్నీ గుర్తొస్తాయి’ అంటూ జీవిత,రాజశేఖర్‌ దంపతులుఎమోషనల్‌ అయ్యారు.

ఇక సినిమాల్లోకి ఎలా వచ్చారో చెబుతూ... ‘నాకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలని కోరిక ఉండేది. కానీ నాకు నత్తి ఉంది. ఒకవేళ నాకు సినిమా చాన్స్‌ వచ్చినా.. నత్తి ఉందని తీసేస్తారేమోననే భయం ఉండేది. అసలు నాకు నటన వచ్చో..రాదో తెలుసుకోవడానికి యాక్టింగ్‌ స్కూల్లో చేరా. అప్పడు నమ్మకం కలిగి.. నటించడం మొదలుపెట్టా’అని రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. 
 

మరిన్ని వార్తలు