ఒక్కసారైనా హీరోగా చేస్తా: సురేష్‌ కొండేటి

6 Oct, 2021 10:16 IST|Sakshi

‘‘దివంగత దర్శకులు దాసరి నారాయణరావుగారే నాకు స్ఫూర్తి. ఆయనలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్‌.. ఇలా అన్ని రంగాల్లో ఎదగాలన్నది నా కోరిక. నటుడిగా మంచి పాత్రలు చేస్తూనే, దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు, నిర్మాత, ‘సంతోషం’ సినీ వారప్రతిక అధినేత సురేష్‌ కొండేటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మంగళవారం సురేష్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నటుడిగా ఎదగాలని 1992లో హైదరాబాద్‌ వచ్చాను. అయితే నాలో నటుడికి కావాల్సిన లక్షణాలు అప్పటికి లేవని తెలుసుకున్నాను. ఆ తర్వాత కృష్ణా పత్రికలో చేరాను. అక్కడ్నుంచి మరో దినపత్రికలో సినిమా జర్నలిస్ట్‌గా చే రాను.
(చదవండి: ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్‌ క్రిష్‌)

రాజేంద్రప్రసాద్‌గారి ‘రాంబంటు’ (1995)లో మొదటిసారి నటుడిగా కనిపించాను. రాజమౌళి ‘స్టూడెంట్‌ నం. 1’ డిస్ట్రిబ్యూటర్‌గా నా తొలి సినిమా.. ఇప్పటివరకూ 75 చిత్రాలు పంపిణీ చేశాను. ‘ప్రేమిస్తే’తో విజయవంతమైన నిర్మాతగా మారాను. ఆ తర్వాత ‘పిజ్జా’ వంటి హిట్‌ మూవీతో పాటు దాదాపు 15 చిత్రాలు అందించాను. నటుడిగా ఇటీవల ‘దేవినేని’ సినిమాలో సెకండ్‌ లీడ్‌ హీరో చేశాను. ఆ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో ఒక్క సినిమాలో అయినా హీరోగా చేయాలనే కోరిక ఉంది. ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’, ‘ఎర్రచీర’ చిత్రాల్లో నటించాను. నేను నిర్మిస్తున్న ఓ సినిమాలోనూ నటిస్తున్నాను. డైరెక్షన్‌.. యాక్షన్‌.. ఈ రెంటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నవంబర్‌ 14న ‘సంతోషం’ అవార్డ్స్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు