Akshay Kumar: వాళ్లను నిందించొద్దు.. వందశాతం తప్పు నాదే: అక్షయ్‌ కుమార్‌

26 Feb, 2023 12:29 IST|Sakshi

ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌.  ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఈ ఖిలాడి హీరో.. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. గతేడాది ఈ హీరో నటించిన అత్రంగిరే ,కట్‌పత్లీ,  బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు చిత్రాలలో ఒకటి కూడా హిట్‌ టాక్‌కి సంపాదించుకోలేదు. కనీస వసూళ్లు కూడా రాకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఇక తాజాగా విడుదలైన ‘సెల్ఫీ’చిత్రం కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన సినిమా పరాజయాలపై అక్షయ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

‘సెల్ఫీ’సినిమా ప్రమోషన్స్‌ భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫ్లాప్‌లపై అక్షయ్‌ మాట్లాడాడు. ‘సినిమాల విషయంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. ఒకనొక సమయంలో నేను నటించిన 16 సినిమాలు నిరాశపరిచాయి. మరోసారి 8 సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా హిట్‌ అవ్వడం లేదంటే అది కచ్చితంగా నా తప్పే. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం ఆశిస్తున్నారు. ప్రస్తుతం నేను దాని కోసమే ప్రయత్నిస్తున్నాను. సినిమా హిట్‌ అవ్వకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. అది వంద శాతం నా తప్పే’ అని అక్షయ్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు