‘ఇండియన్‌ -2’ వివాదం: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

22 Apr, 2021 17:30 IST|Sakshi

‘ఇండియన్‌ -2’ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మద్రాసు హైకోర్టు సూచించింది. కోర్డు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది. లైకా ప్రొడక్షన్‌లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్‌పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్‌ తమ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చికే ‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పూర్తి చేస్తామని శంకర్‌ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. నటుడు వివేక్‌ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్‌ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.

1996లో కమల్‌హాసన్‌  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్‌ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్‌  2’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరగడం, కమల్‌ హాసన్‌  మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్‌  2’కు బ్రేక్‌ పడింది.

మరిన్ని వార్తలు