Intinti Gruhalakshmi: కొడుకింటికి వెళ్లిన నందు దంపతులకు ఘోర అవమానం

16 Jun, 2021 12:49 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 347వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

త్వరలోనే ఓ పసిబిడ్డకు తండ్రవుతానన్న సంతోషం అభికి ఎక్కువకాలం నిలవలేదు. అటు కొడుకును మనసారా ఆశీర్వదించడానికి వెళ్లిన తులసి, నందుల ఆనందం కూడా క్షణాల్లో ఆవిరైపోయింది. అంకిత అబార్షన్‌ చేసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో అభి గుండె బద్ధలైంది. అతడిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరి నేటి(జూన్‌ 16) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

నందుతో కలిసి అభి దగ్గరకు వెళ్లడానికి తులసి అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ వేర్వేరు కార్లలో అభి ఇంటికి చేరుకున్నారు. కానీ కొడుకు సంతోషం కోసం ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. అంకిత త్వరలో ఓ పసిపాపను చేతిలో పెడుతుందని తెగ సంతోషడిపోయారు. ఇక గర్భవతిగా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తులసి చెప్తుండగా ఉన్నట్లుండి అంకిత ఏడుపందుకుంది. తనను క్షమించమని వేడుకుంది. ఇంతలో ఏమైందని అందరూ గాబరా పడగా అంకిత అబార్షన్‌ చేయించుకున్న విషయాన్ని ఆమె తల్లి బయట పెట్టింది. దీంతో ఆడుకోవడానికి మాకు మనవడిని ఇస్తున్నాడని సంతోషంతో వెళ్లిన నందు దంపతులకు నిరాశే ఎదురైంది. 

పిల్లలంటే పడి చచ్చే అభి తన భార్య అబార్షన్‌ చేయించుకోవడాన్ని సహించలేకపోయాడు. అంకితను లాగి చెంప మీద కొట్టాడు. మా ముందే కూతురి మీద చేయి చేసుకుంటావా? అంటూ అంకిత తల్లిదండ్రులు ఆవేశంతో ఊగిపోయారు. దీంతో చిర్రెత్తిపోయిన అభి అబార్షన్‌ తప్పని మీ కూతురిని ఎందుకు ఆపలేదని ఎదురు ప్రశ్నించాడు. మా ప్రేమకు ప్రతీకలా పెరుగుతున్న పసిగుడ్డును చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంకితను జీవితంలో క్షమించను అని తేల్చి చెప్పాడు.

అభికి తెలియకుండా అబార్షన్‌ చేయించడం తప్పన్న నందు మీద కూడా అంకిత తల్లిదండ్రులు ఫైర్‌ అయ్యారు. మీ క్యారెక్టర్‌ ఏంటో చూసుకోండి, మీరు నోరు విప్పితే నలుగురూ నవ్విపోతారు.. అంటూ చీవాట్లు పెట్టారు. దీంతో అవమానభారంతో తలదించుకున్న నందు, తులసి కన్నీళ్లతో అక్కడి నుంచి చెరో దారిన వెళ్లిపోయారు. అయితే అభి పరిస్థితిని తల్చుకుని బాధపడ్డ తులసి కొడుకుకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భావించింది. మరి అందుకు తల్లిగా తనేం చేయనుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

చదవండి: Tamanna Bhatia: బుల్లితెరపై సందడి చేయనున్న తమన్నా!

మరిన్ని వార్తలు