Jabardasth Apparao: ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్‌ అప్పారావు

7 Jul, 2022 12:21 IST|Sakshi
విలేకర్లతో ముచ్చటిస్తున్న అప్పారావు 

అద్దంకి రూరల్‌(ప్రకాశం జిల్లా): నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు పేర్కొన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక పెండ్యాల ప్లాజాలో విలేకర్లతో ముచ్చటించారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ ఉండేదన్నారు. ‘శుభవేళ’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిశ్రమకు పరిచయమైనట్లు తెలిపారు. షకలక శంకర్‌ ప్రోత్సాహంతో ఓ తెలుగు చానల్‌ కామెడీ షోలో పాత్రలు పోషించానని, ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో 6 నెలల క్రితమే తప్పుకున్నాని చెప్పారు.
చదవండి: బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్‌

విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం తన స్వస్థలమని, పట్టుదలతోపాటు భార్య సహకారంతో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన భార్య 18 ఏళ్లు టీచర్‌గా పనిచేస్తూనే ప్రోత్సహించిందన్నారు. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించినట్లు వివరించారు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని తెలిపారు. తనకు రాని ఇంగ్లిష్‌ భాషతోనే అందరినీ ఆకట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినీ రంగాన్ని ఎంచుకునే యువకులు ఏ శాఖలో ప్రతిభ ఉందో గ్రహించి శిక్షణ పొందితే విజయం సాధించవచ్చని సలహా ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారిని ఎవరూ అడ్డుకోలేరని హాస్యన టుడు అప్పారావు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు