Comedian Mimicry Murthy Death: విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత

28 Sep, 2022 12:27 IST|Sakshi

జబర్దస్త్‌లో అందరినీ నవ్విస్తూ.. నవ్వుతూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మిమిక్రీ కళాకారుడు, కమెడియన్‌ కొమ్ము నర్సిమూర్తి(48) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో విషాదం అలుముకుంది. ఎన్నో స్టేజి షోలు.. అనేక సినిమాల్లో నటించిన మూర్తికి జబర్దస్త్‌ ద్వారా మంచి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన సినీ రంగంలో వస్తున్న అవకాశాలతో భార్య అంజలి, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కేన్సర్‌ బారిన పడ్డాడు.

దీంతో మూడేళ్లుగా జబర్దస్త్‌ షోకు దూరంగా ఉంటూ.. ఏపీ మంత్రి, నటి రోజా, తన తోటి నటులు, స్నేహితులు అందించిన ఆర్థికసాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే రూ.16 లక్షలు చికిత్స కోసం ఖర్చు చేశారు. మరో రూ.20లక్షలు చికిత్సకు అవసరం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఆరోగ్యం మరింత క్షీణించి చికిత్స పొందతూనే మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా జబర్దస్త్‌ కమెడియన్‌ వెంకట్‌తో పాటు సహానటులు, గ్రామస్తులు తరలివచ్చి నివాళులర్పించారు. నాగారంలో బుధవారం మధ్యాహ్నం మూర్తి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు