టాలీవుడ్‌లోకి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

3 Feb, 2021 16:27 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె యువరాణి పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్‌ వజ్రాల దొంగగా కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. దీంతో పవన్‌తో జోడీ కట్టే భామ ఎవరా? అని ఆయన అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలో రెండో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఫైనల్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆమె పాత్ర వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ శ్రీలంక భామ గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో చిందులేసింది. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఆడిపాడి అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఏయం రత్నం నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. (చదవండి: పవన్‌ కల్యాణ్‌ న్యూ లుక్‌ ఫోటోలు వైరల్‌)

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటించిన వకీల్‌ సాబ్‌ ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక పవన్‌ కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 25న ఆరంభమైంది. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే– సంభాషణలు అందిస్తున్నాడు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. (చదవండి: వకీల్‌ సాబ్‌ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్‌)

మరిన్ని వార్తలు