ఆ టైటిల్‌ అందుకే పెట్టాం: జగపతిబాబు

8 Feb, 2021 08:48 IST|Sakshi
విద్యాసాగర్‌ రాజు, కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్, రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి, భీమ్స్, జగపతిబాబు, సునీల్‌

‘‘ఎఫ్‌సీయూకే’ టైటిల్‌ను చూసి కొంతమంది వేరేగా అనుకుంటున్నారు. మా సినిమాలో బూతు లేదు. జనాలకు రీచ్‌ కావాలనే ఆ టైటిల్‌ పెట్టాం’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్‌–చిట్టి–ఉమా–కార్తీక్‌)’. జగపతిబాబు ప్రధానపాత్రలో, రామ్‌ కార్తీక్‌ – అమ్ము అభిరామి జంటగా, బేబీ సహస్రిత కీలక పాత్రలో నటించారు. కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎఫ్‌సీయూకే బారసాల(ప్రీ రిలీజ్‌) వేడుక జరిగింది. ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను ఇప్పటికే కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ చేతుల మీదుగా విడుదల చేయగా, వాటి వీడియో సాంగ్స్‌ను పాపులర్‌ యూట్యూబర్స్‌తో రిలీజ్‌ చేయించారు.

జగపతిబాబు మాట్లాడుతూ – ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైనర్‌ ఈ సంవత్సరం ఇంకా రాలేదు. మా చిత్రం ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీ రంజిత్‌ మూవీస్‌ పతాకంపై 46 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నా. ఒక్క మాటలో ప్రతి విషయంలోనూ ‘ఎఫ్‌సీయూకే’ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు డైరెక్టర్‌. ‘‘సినిమాకు మంచి పాజిటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయి’’ అన్నారు రామ్‌ కార్తీక్‌. ‘‘సాల్ట్, పెప్పర్‌ తినే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి’’అన్నారు నటుడు సునీల్‌. లైన్‌ ప్రొడ్యూసర్‌ వాసు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్, నటుడు–రచయిత బాలాదిత్య, రైటర్‌ కరుణాకర్, నటుడు భరత్‌ పాల్గొన్నారు.

(చదవండి: ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్‌!)

(చదవండి: పవన్‌‌ సినిమాలో మెరవనున్న స్టార్‌ డైరెక్టర్‌!)

మరిన్ని వార్తలు