ఆనందయ్య మందు వాడాను, ఇప్పటి వరకు కరోనా రాలేదు: జగపతిబాబు

5 Jun, 2021 15:29 IST|Sakshi

ఒకవైపు కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుంటే, మరోవైపు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన మందు కరోనాకు పని చేయదని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ఆనంద‌య్య ఆయుర్వేద మందు ఎలాంటి హానీ క‌లిగించ‌ద‌ని చెప్పుకొచ్చారు. ఎన్నో పరిణామాల అనంతరం.. మళ్లీ ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జనాలు ఆనందయ్య మందు కోసం క్యూ కడుతున్నారు. సామాన్యులే కాదు కొంద‌రు సెల‌బ్రిటీలు కూడా ఈ మందును విశ్వ‌సిస్తున్నారు.

తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు తాను ఆనందయ్య మందును ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదని తాను బలంగా నమ్ముతానన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒక‌డినని. తనకు క‌రోనా రాలేదని ఆయన స్ప‌ష్టం చేశారు. 

‘ఆయుర్వేదం మందులను పకృతి సహాజమైన ఔషధాలతో తయరు చేస్తారు. అలాంటి మందు ఎలాంటి హానీ చేయ‌దని నేను విశ్వ‌సిస్తున్నాను. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను’’ అన్నారు జగపతిబాబు.

‘‘ఎవరేమన్నా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ అయితే ఉండవు. కచ్చితంగా మంచే జరుగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. అదృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టి వ‌ర‌కు నాకు కోవిడ్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటు చెప్పుకొచ్చారు. ‘ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ మందు శాస్త్రీయంగా అనుమ‌తులు పొంది  ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా. అతన్ని దేవుడు ఆశీర్వ‌దించాలి’ అంటూ ఇంతకుముందు జగపతిబాబు ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు