Jai Bhim: హీరో సూర్యకు బెదిరింపులు.. దాడి చేస్తే రూ. లక్ష బహుమతి!

15 Nov, 2021 16:10 IST|Sakshi

PMK Announces Rs 1 Lakh Reward for Attacking Hero Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్‌ పలు వివాదాలకు దారితీస్తుంది. భారీ అంచనాల మధ్య ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తుంటే.. మరోవైపు అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇటీవల సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.
(చదవండి: పార్వతి అమ్మాళ్‌కు సూర్య రూ. 10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌)

అంతేకాదు వన్నియార్‌ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది.

ఇదే వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం లేదని.. వివరణ ఇచ్చారు. మరోపైపు పలువురు ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా సూర్యకు మద్దతు ప్రకటిస్తున్నారు. 


మరిన్ని వార్తలు