జేమ్స్‌ బాండ్‌ నటి తన్య రాబర్ట్‌ మృతి

4 Jan, 2021 12:40 IST|Sakshi

లాస్‌ ఎంజెలస్‌: జేమ్స్‌ బాండ్‌ 007 సిరీస్‌ నటి తన్య రాబర్ట్‌(65) మృతి చెందారు. ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం కన్నుమూశారు. క్రిస్టమస్‌‌ సందర్భంగా డిసెంబర్‌ 24న తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్-సినార్ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆమె స్నేహితుడు, ప్రతినిధి మైక్ పింగెల్ స్థానిక మీడియాకు తెలిపాడు. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారన్నారు. ఈ క్రమంలో తన్య నిన్న మృత్యువాత పడినట్లు ఆయన వెల్లడించారు.

అయితే ఆమె మృతికి కారణం ఇంకా తెలియలేదని, చనిపోవడానికి ముందు తన్య రాబర్ట్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విక్టోరియా లీ బ్లమ్‌లో జన్మించిన తాన్య రాబర్ట్స్ మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1975లో వచ్చిన హర్రర్ చిత్రం ఫోర్స్‌డ్‌తో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1985లో జేమ్స్‌ బాండ్‌ 007 చిత్రంలో తన్య అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతో తన్య‌‌ నటిగా మంచి గుర్తింపు పొందారు. అయితే సినిమాలలో నటించడానికి ముందు ఆమె కొన్ని టెలివిజన్ ప్రకటనలు కూడా చేశారు. 

మరిన్ని వార్తలు