జాన్వీ కొత్త సినిమా షూటింగ్‌కు నిరసన సెగ

13 Jan, 2021 20:58 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌కు అన్నదాతల నిరసన సెగ తగిలింది. షూటింగ్‌ నిమిత్తం పంజాబ్‌కు వెళ్లిన ఆమెను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో షూటింగ్‌ జరగనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. కాగా జాన్వీ కపూర్‌ ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో ‘గుడ్‌లక్‌ జెర్రీ’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. చిత్రీకరణ కోసం మూవీ యూనిట్‌..  జనవరి 11న పంజాబ్‌లోని ఫతేఘర్‌ సాహిబ్‌లోని బస్సీ పఠానాకు వెళ్లింది. (చదవండి: సాగు చట్టాల అమలుపై స్టే)

అక్కడికి చేరుకున్న రైతులు.. తమ ఆందోళనకు జాన్వీ కపూర్‌ మద్దతు తెలపాలని కోరారు. ఆమె అందుకు అంగీకరించడంతో కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం గురించి చిత్ర నిర్మాత ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్‌ పరిశ్రమపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే సెలబ్రిటీలు మౌనం వీడకపోవడాన్ని తప్పుబట్టారన్నారు. ఇక కేవలం జాన్వీకో, మరే ఇతర యూనిట్‌ సభ్యుడి పట్ల వారికి ద్వేష భావం లేదని ,అయితే తమకు మద్దతు తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు. కాగా గుడ్‌లక్‌ జెర్రీకి సంబంధించిన జాన్వీ ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక జాన్వీ రైతులను సపోర్టు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. (చదవండి: వైరల్‌: దుమ్మురేపుతోన్న జాన్వీ బెల్లి డ్యాన్స్)‌

మరిన్ని వార్తలు