Janhvi Kapoor: సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌తో ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ

3 Feb, 2023 10:37 IST|Sakshi

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె కీర్తిని మాత్రం ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. శ్రీదేవి వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ నటిగా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే! ఇప్పటికే బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీ దక్షిణాది చిత్రాల్లో నటించాలని చాలా కాలంగా కోరుకుంటోంది. అదేవిధంగా దక్షిణాది దర్శకనిర్మాతలు కూడా ఆమెను తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు దక్షిణాదిలో జాన్వీ నటించనేలేదు. ఆ మధ్య తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో జతకట్టనుందంటూ ప్రచారం జోరుగా సాగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు లింగుసామి 13 ఏళ్ల క్రితం అంటే.. 2010లో కార్తీ, తమన్నా జంటగా తెరకెక్కించిన పయ్యా సినిమా మంచి విజయాన్ని సాధించింది. అది రోడ్డు ట్రావెలింగ్‌ కథా చిత్రంగా రూపొందింది. తాజాగా లింగుసామి పయ్యాకు సీక్వెల్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తాజా సమాచారం. అయితే మొదటి భాగంలో నటించిన కార్తీ, తమన్నా ఈ సీక్వెల్‌లో నటించడం లేదట. ఆర్య కథానాయకుడిగానూ, ఆయనకు జంటగా జాన్వీకపూర్‌ నటించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశముంది. ఇది నిజమైతే జాన్వీకపూర్‌ దక్షిణాదిలో నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది.

చదవండి: కె. విశ్వనాథ్‌ చివరి క్షణాల్లో జరిగిందిదే..

మరిన్ని వార్తలు