జాతిరత్నాలు క్లోజింగ్‌ కలెక్షన్స్‌: ఎంత లాభం వచ్చిందంటే?

11 Apr, 2021 10:08 IST|Sakshi

ఈ మధ్యకాలంలో యూత్‌ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుంది. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. దీంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు మనసారా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. మొత్తానికి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా భారీ హిట్‌ కొట్టి నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా క్లోజింగ్‌ కలెక్షన్లు ఎంత? నిర్మాతలకు ఏమేరకు లాభాలు వచ్చాయో చదివేయండి..

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్‌ కేవీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు. టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్‌ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్‌ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపింది.

ఫలితంగా నైజాంలో రూ.16.18 కోట్లు, సీడెడ్‌లో రూ.4.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.1.92 కోట్లు, వెస్ట్‌లో రూ.1.58 కోట్లు, కృష్ణాలో 1.81కోట్లు, గుంటూరులో రూ.2.08 కోట్లు, నెల్లూరులో 92 లక్షలు వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 32.59 కోట్లు షేర్‌, రూ.52 కోట్ల పైచిలుకు గ్రాస్‌ రాబట్టింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్‌, రూ.70 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. 

థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.10 కోట్ల పైమాటే ఉండటంతో బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ పదకొండున్నర కోట్లుగా నమోదైంది. కానీ జాతిరత్నాలు ఏకంగా రూ.39 కోట్లకు పైమాటే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్ల లాభాలను అందుకుంది. దీంతో జాతిరత్నాలు రూ.27 కోట్లకు పైగా లాభాల మార్కును చేరుకున్న చిన్నచిత్రంగా ఘనత సాధించింది. ఇదిలా వుంటే ఈ సినిమా నేటి(ఆదివారం) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

చదవండి: 'ఆస్కార్'‌ బరిలో జాతిరత్నాలు!

మరిన్ని వార్తలు