జాతిరత్నాలు ప్రేక్షకుల్ని నవ్విస్తారు

28 Feb, 2021 08:57 IST|Sakshi
అనుదీప్, ఫరియా, నాగ్‌ అశ్విన్, నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి

‘‘జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, యస్వీ కృష్ణారెడ్డిగార్ల చిత్రాలంటే నాకు బాగా ఇష్టం. వారి సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసినా పెదవిపై ఒక చిరునవ్వు వస్తుంది. అలాంటి ఫన్‌ ఫిల్మ్‌ ఈ ‘జాతిరత్నాలు’ అని నాగ్‌ అశ్విన్‌ అన్నారు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘మహానటి’ టైమ్‌లో అనుదీప్‌ కలిసి, పూర్తి కామెడీగా ఉన్న ‘జాతిరత్నాలు’ స్క్రిప్ట్‌ చెప్పాడు. వినేటప్పుడే విపరీతంగా ఎంజాయ్‌ చేశాను. ఇది పూర్తిగా అనుదీప్‌ చిత్రం. నా ఇన్వాల్వ్‌మెంట్‌ లేదు. ప్రియాంక, స్వప్న సపోర్ట్‌తో చాలా జాగ్రత్తగా చేశాం’’ అన్నారు. నవీన్‌ పోలిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, చిచ్చోరే’ తర్వాత నేను నటించిన మూడో చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ కథ చెబుతున్నప్పుడే విపరీతంగా ఎంజాయ్‌ చేశాను. వైజయంతి, స్వప్న సినిమాస్‌ బ్యానర్లో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘పూర్తి వినోదభరిత చిత్రమిది. ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్‌ చేస్తారు. నాగ్‌ అశ్విన్, స్వప్న, ప్రియాంక ఎంతో సపోర్ట్‌ చేశారు’’ అన్నారు అనుదీప్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, నటుడు ప్రియదర్శి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు