ఆయన లేకపోతే జాతిరత్నాలు లేదు

18 Mar, 2021 08:01 IST|Sakshi
మనోహర్‌ సిద్ధం, అభినవ్‌ దండా

‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల కన్నా ‘జాతిరత్నాలు’ సినిమాకు నాగీ అన్న (నాగ్‌ అశ్విన్‌) ఎక్కువ కష్టపడ్డారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు’’ అని సినిమాటోగ్రాఫర్‌ సిద్ధం మనోహార్‌ అన్నారు. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా ‘జాతిరత్నాలు’ సినిమాటోగ్రాఫర్‌ మనోహార్‌ మాట్లాడుతూ– ‘‘నాది నెల్లూరు. నాగీ (నాగ్‌ అశ్విన్‌) అన్న కార్పొరేట్, వెడ్డింగ్‌ వీడియోస్‌ను డైరెక్ట్‌ చేసే ప్రాసెస్‌లో ఉన్న సమయంలో చాలా వర్క్‌ నేర్చుకున్నా. ‘ఎవడే సుబ్రమణ్యం’ సమయంలో నేను దర్శకత్వ ప్రయత్నాలు చేశాను. డైరెక్షన్‌లోకి వెళితే సినిమాటోగ్రఫీ చేయలేవని నాగీ, స్వప్న కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

‘మహానటి’ సినిమాకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా చేశాను. ‘అమ్మ దీవెన’ చిత్రంతో పాటు ఓ చిన్న సినిమాకు కెమెరామ్యాన్‌గా పని చేశాను. తర్వాత చేసిన ‘జాతిరత్నాలు’ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో ‘జాతిరత్నాలు’ ఎడిటర్‌ అభినవ్‌ మాట్లాడుతూ– ‘‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. వెడ్డింగ్‌ ఫిల్మ్స్, కమర్షియల్‌ యాడ్స్‌ని సరదాగా షూట్‌ చేసి ఎడిట్‌ చేసేవాణ్ణి. ఏడాదిన్నర క్రితం ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ అనే వెబ్‌ సిరీస్‌ ఎడిటర్‌గా నాకు పెద్ద ప్రాజెక్ట్‌. దాని తర్వాత ‘జాతిరత్నాలు’ చిత్రానికి ఎడిటర్‌గా చేశాను. డైరెక్టర్‌ కావాలన్నది నా లక్ష్యం. ఎడిటర్లలో డైరెక్టర్స్‌ అయినవారూ ఉన్నారు. ‘రాజూ హిరానీ, ఆంథోనీ, రాజమౌళి లాంటి వాళ్ళకు ఎడిటింగ్‌లో మంచి స్కిల్‌ ఉంది. కథను ఎలా చెప్పాలి?, క్యారెక్టర్స్‌ను ఎలా చూపించాలి? అనేవి ఎడిటింగ్‌ ద్వారానే మరింత తెలుస్తాయి’’ అన్నారు.

చదవండి: దర్శకుడి హాస్పిటల్‌ బిల్‌ కట్టిన విజయ్‌ సేతుపతి

నవ్వులు పూయించిన ‘జాతి రత్నాలు’

మరిన్ని వార్తలు