Jaya Bachchan: వాడిని పిచ్చి ఆస్పత్రికి తరలించండి: జయాబచ్చన్ ఆగ్రహం

28 Mar, 2023 19:09 IST|Sakshi

అమెరికన్ సిట్‌ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్‌  షోలో మాధురి దీక్షిత్‌పై చేసిన కామెంట్స్‌పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు.  

ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్‌  ఐశ్యర్యారాయ్‌తో పోలుస్తూ మాధురీ దీక్షిత్‌ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్‌ వ్యాఖ్యల పట్ల  జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. 

ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్‌ను పోలుస్తూ కునాల్ నయ్యర్‌ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్‌కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ'  భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్‌ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. 

నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు

అయితే ఈ ఎపిసోడ్‌ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్  స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్‌ఫ్లిక్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌పై  కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని..  పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు.

బిగ్ బ్యాంగ్ థియరీ

'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్‌కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. 

మరిన్ని వార్తలు