సంగీత దర్శకుడు అమ్రీష్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊరట

25 Jun, 2021 15:48 IST|Sakshi

సాక్షి, చెన్నై: తన కుమారుడు అమ్రీష్‌పై అక్రమంగా బనాయించిన అన్ని కేసులను మద్రాసు హైకోర్టు కొట్టివేసిందని సీనియర్‌ సినీనటి, దర్శక, నిర్మాత జయచిత్ర తెలిపారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ సంగీత దర్శకునిగా తమిళ సినీ ప్రపంచంలో దూసుకుపోతున్న తన కుమారుడిని ఇరీడియం కేసులో ఇరికించి పెద్ద ఎత్తున డబ్బు కాజేయాలని పన్నాగం పన్నారని తెలిపారు. అందులో అమ్రీష్‌కు ఎలాంటి సంబంధం లేదని ఈ నెల 15వ తేదీన కోర్టు తీర్పు చెప్పిందన్నారు.

అలాగే అన్ని కేసులనూ కొట్టివేసినట్లుగా తనకు బుధవారం కోర్టు పత్రాలు అందాయని ఆమె తెలిపారు. అమ్రీష్‌ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అక్రమ కేసుల్లో ఇరికించడం తల్లిగా తనను ఎంతో బాధించిందన్నారు. దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచిందని, ఇకపై అమ్రీష్‌కు అన్నీ తానై వ్యవహారాలను పర్యవేక్షిస్తానని వివరించారు. కేసుల నుంచి బయటపడిన అమ్రీష్‌పై అభినందనల వర్షం కురిపిస్తూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించిన సినీ ప్రముఖులకు కలైమామణి జయచిత్ర కృతజ్ఞతలు చెప్పారు.

మరిన్ని వార్తలు