జయాజీ... కొంచెం దయ చూపించండి

16 Sep, 2020 04:02 IST|Sakshi

బాలీవుడ్‌లో సుశాంత్‌ సింగ్‌ మరణం తర్వాత డ్రగ్స్‌ కలకం మొదలయింది. ఇటీవలే నటుడు, యంపీ రవి కిషన్‌ ‘డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి. దోషుల్ని పట్టుకొని విచారణ జరపాలి’ అని ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని పార్లమెంట్‌లో వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశిస్తూ సీనియర్‌ నటి, యంపీ జయాబచ్చన్‌ మాట్లాడారు. ‘‘కొంతమంది అన్నం పెట్టిన చేతినే కరవాలనుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి అండగా ప్రభుత్వం నిలబడాలి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఇండస్ట్రీ తన వంతు సహాయం చేసింది. కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ తప్పు అనే ఇమేజ్‌ తీసుకురావడం కరెక్ట్‌ కాదు’’ అని జయ అన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు జయ మాట్లాడిన విషయాన్ని కొనియాడారు. కంగనా రనౌత్‌ మాత్రం జయతో ఏకీభవించలేదు. ‘‘జయాజీ, మీ అమ్మాయి శ్వేతా బచ్చన్‌ కూడా టీనేజ్‌లో డ్రగ్స్‌కి బానిసయి, లైంగిక వేధింపులకు గురైతే ఇలానే మాట్లాడతారా? మీ అబ్బాయి అభిషేక్‌ కూడా అదే పనిగా హెరాస్‌మెంట్‌ ఎదుర్కొని, ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి స్టాండే తీసుకోగలరా? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. కొంచెం దయ చూపించండి’’ అని జయా బచ్చన్‌ వీడియోను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు కంగనా.

మరిన్ని వార్తలు