Jayam Ravi : పొన్నియన్‌ సెల్వన్‌-2 తర్వాతి ప్రాజెక్ట్స్‌పై జయం రవి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

29 Apr, 2023 16:52 IST|Sakshi

మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా నటుడు జయం రవి పేర్కొన్నారు. శుక్రవారం ఈ చిత్ర రెండవ భాగం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో జయం రవి టైటిల్‌ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఐదేళ్ల శ్రమ పొన్నియిన్‌ సెల్వన్‌ (రెండు భాగాలు) అని ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం మరచిపోలేని మధురానుభూతిగా జయం రవి పేర్కొన్నారు.

చదవండి:రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు 

షూటింగ్‌ సమయంలో అందరం పలు విషయాల గురించి ముచ్చటించుకునే వాళ్లమని చెప్పారు. మళ్లీ ఇంతమంది ప్రముఖ నటీనటులతో కలిసి నటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ముందుకు రావాలిగా అని పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని భారీ చిత్రాల్లో నటించిన తరువాత మీరు నటిస్తున్న తర్వాత చిత్రాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్న ప్రశ్నకు మనం రోజూ బిరియానీ తినలేము కదా, సాంబారు అన్నం తినక తప్పదు కదా. అదే విధంగా పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి చిత్రాలు అరుదుగా వస్తాయని కాబట్టి తన తర్వాత చిత్రాలకు ఆదరణ లభిస్తుందా అనే సందేహం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను ఇరైవన్‌ చిత్రాన్ని పూర్తి చేశానని, నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. ప్రస్తుతం సైరన్‌ చిత్రంలో నటిస్తున్నానని ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. కాగా సైరన్‌ చిత్రంలో తండ్రి పాత్ర కోసం సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు రాజేష్‌ ఎం.దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నట్లు ఇది కూడా షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు.

చదవండి: ‘ఏజెంట్‌’కు ఊహించని కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే..?

మెగా ఫోన్‌ ఎప్పుడు పట్టనున్నారు అన్న ప్రశ్నకు ఆ ఆలోచన ఉందని అందుకు చిన్నచిన్న కథలను కూడా తయారు చేసుకున్నట్లు చెప్పారు. అందులో ఒక కథ గురించి చెప్పగా బాగుంది నువ్వు మంచి దర్శకుడు అవుతావు అని పేర్కొన్నారు. కాగా తాను దర్శకత్వం వహించే చిత్రంలో కార్తీ నటిస్తారని ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పానని జయంరవి చెప్పారు.

మరిన్ని వార్తలు