నెగటివ్‌ రోల్‌: రూ. 20 కోట్ల రెమ్యునరేషన్‌!

7 Nov, 2020 20:16 IST|Sakshi

ముంబై: ‘‘జీరో’’ సినిమా డిజాస్టర్‌ తర్వాత చాలాకాలం పాటు వెండితెరకు దూరమైన బాలీవుడ్‌ బాద్‌షా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌  నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. ఈ సినిమాకు ‘పఠాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఇక తన గత చిత్రం ‘వార్‌’ మాదిరిగానే ఇందులోనూ భారీ యాక్షన్‌ సీన్స్‌ ప్లాన్‌ చేశాడట డైరెక్టర్‌. అందుకే యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహాంను ఇందులో విలన్‌గా నటింపజేస్తున్నారట. ఇందుకోసం నిర్మాతలు అతడికి సుమారు రూ. 20 కోట్లు చెల్లిస్తున్నట్లు బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. తన బిజీ షెడ్యూల్‌లోనూ ఈ సినిమా కోసం సుమారు 60 రోజుల పాటు కాల్షీట్లు కేటాయించిన జాన్‌ అబ్రహం ఇందుకు అర్హుడే అంటూ అతడి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. షారుక్‌తో అతడు తలపడే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి అంటున్నారు. (చదవండి: ఈద్‌కి సత్యమేవజయతే 2)

కాగా ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌ తదితర సినిమాల్లో షారుక్‌కు జోడీగా నటించిన దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం ఆమెకు సైతం భారీ మొత్తంలోనే పారితోషికం చెల్లిస్తున్నారట. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జాన్‌ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్‌’లో హీరోగా నటిస్తుండగా, ఆయన నటించిన ‘సత్యమేవ జయతే 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాక మలయాళంలో సూపర్‌ హిట్‌కొట్టిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ హక్కులు దక్కించుకుని నిర్మాతగానూ బిజీ అయ్యాడు. ముంబైకి చెందిన రేవతీ రాయ్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా కూడా నిర్మించేందుకు జాన్‌ అబ్రహాం సిద్ధమయ్యాడు.

మరిన్ని వార్తలు