ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. వెనకడుగు వేసిన యంగ్‌ టైగర్‌!

30 Apr, 2021 19:46 IST|Sakshi

తనదైన నటనతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, బిగ్‌బాస్‌ సీజన్‌-1లో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డం వల్లే బిగ్‌బాస్‌ సీజన్‌-1 మంచి స‌క్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిగా లేదు. అయితే ఆ షో తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. ఇటీవల ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు.  త్వరలోనే జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ షో టెలికాస్ట్ కావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.

వాస్తవానికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోని మే నెలలలోనే టెలికాస్ట్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు మేకర్స్‌. అందులో భాగంగా ఇప్పటికే ప్రోమోలను కూడా విడుదల చేశారు. కానీ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దాడి ప్రారంభం కావడంతో షోని వాయిదా వేయక తప్పలేదట.

కరోనా కారణంగా ఇప్పటికే ఎన్టీఆర్‌ నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. కరోనా ఉధృతి తగ్గగానే ఇంతకు ముందు కమిటైన సినిమాల షూటింగ్స్‌లో బిజీ కానున్నారు. ఆ సమయంలో ఈ షోకి డేట్స్‌ సర్థుబాటు చేసుకోవడం ఎన్టీఆర్‌కు వీలుకాకపోవచ్చు. అందుకే జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో ఈ షో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన మరో రెండు నెలల తర్వాతే బుల్లితెరపై ఎన్టీఆర్‌ని చూడొచ్చన్నమాట. అసలే సమ్మర్‌.. దానికి తోడు కరోనా కలకలం.. ఈ సమయంలో ఇంట్లో కూర్చొని తమ అభిమాన హీరో షోని తిలకిద్దామన్న ఫ్యాన్స్‌కి ఇది చేదు వార్తే. 

మరిన్ని వార్తలు