ఆ రోజు అందరం వేడుక చేసుకుందాం: జూనియర్‌ ఎన్టీఆర్‌

19 May, 2021 10:26 IST|Sakshi

స్టార్‌ హీరోల బర్త్‌డే అంటే అభిమానులకు పండగతో సమానం. వారి బర్త్‌డే రోజు ఏం చేయాలా? అని ఎప్పటి నుంచో ప్లాన్‌లు వేసుకుంటూ ఉంటారు. తీరా పుట్టినరోజు నాడు వారు చేసే సంబరాలు అంబరాన్ని అంటుతుంటాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు కళ తప్పింది. కరోనా కాలంలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వద్దంటూ హీరోలు అభిమానులకు సూచిస్తూ వస్తున్నారు. తాజాగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఒక లేఖను విడుదల చేశాడు.

"గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరందించే అతి పెద్ద కానుక".

"ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మన సంఘీభావం తెలపాలి. ఆత్మీయులను కోల్పోయిన వారికి అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరూ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజు అందరం కలిసి వేడుక చేసుకుందాం.." అని ఎన్టీఆర్‌ రాసుకొచ్చాడు.

చదవండి: ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిరంజీవి

మరిన్ని వార్తలు