జూనియర్‌కు అరుదైన గౌరవం.. అసెంబ్లీకి వెళ్లనున్న ఎన్టీఆర్‌

29 Oct, 2022 16:47 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో  పాల్గొననున్నారు.  ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్‌ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్‌ రాజ్‌ కుమార్ నిలవనున్నారు.

టాలీవుడ్‌లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌, జ్ఞానపీఠ్​ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది.  ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం  కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు