దిశ చనిపోయి ఏడాది.. ఉప్పెనలా ట్వీట్లు

8 Jun, 2021 20:40 IST|Sakshi

సుశాంత్ సింగ్ రాజ్​పుత్​తో సహా పలువురు బాలీవుడ్​ ప్రముఖులకు పీఆర్​ మేనేజర్​గా వ్యవహరించింది​ దిశా సలియాన్. ఆమె​ మరణించి నేటికి(జూన్​ 8) సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. దిశ చనిపోయిన ఆరు రోజులకి సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ చనిపోయాడు. దిశ మరణం ఈనాటికీ ఒక మిస్టరీనే. ఈ తరుణంలో దిశ చావుకి, సుశాంత్​ చావుకి  ఏదో లింక్​ ఉందనేది సుశాంత్ ఫ్యాన్స్​ అనుమానం. అందుకే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ట్విట్టర్​లో జస్టిస్​ ఫర్​ దిశ హ్యాష్​ట్యాగులతో క్యాంపెయిన్​ నడిపించారు.

ముంబై: దిశ సలియాన్​ పోయినేడాది జూన్​ 8న చనిపోయింది. ముంబైలో మలాడ్​ వెస్ట్ ప్రాంతంలోని జన్​కళ్యాణ్ అపార్ట్​మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చాలా కాలంగా డిప్రెషన్​లో ఉందని, అందుకే సూసైడ్ చేసుకుందని దిశ కాబోయే భర్త రోహన్​ రాయ్​ మీడియాతో చెప్పాడు. అయితే ఆమె మృతిపై అందరికీ అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. శవంగా కింద ఉన్న టైంలో ఆమె ఒంటి మీద బట్టలు లేవని, ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని, ఆమె మరణానికి ముందు ఆమె అపార్ట్​మెంట్​కి కొందరు వచ్చారని, సామూహిక అత్యాచారం చేశారని, ఒకానొక దశలో నటుడు సూరజ్​ పంచోలీ ఆమెను గర్భవతిని చేశాడని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. అయితే యాక్సిడెంటల్​ డెత్​గా నమోదు చేసుకున్న ముంబై పోలీసులు కేసును క్లోజ్​ చేశారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ డెత్​ కేసు దర్యాప్తును సీబీఐ తీసుకున్నాక.. దిశ కేసును కూడా పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒక సెలబ్రిటీ ఫిగర్ విషయంలో ఇంతకాలమైనా ఎటు తేలకపోవడంపై చాలా మందిలో అసంతృప్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ కేసు చాలామందికి ముఖ్యంగా సుశాంత్ అభిమానులకు ఆమె పట్ల సానుభూతి క్రియేట్ అయ్యింది.

మే 26.. దిశ డే
దిశ సలియాన్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టింది. ముంబైలో చదువుకున్న దిశ.. మాస్​ మీడియా కోర్సులో డిగ్రీ చేసి పీఆర్​ ఏజెన్సీలోకి అడుగుపెట్టింది. టైమ్స్​ గ్రూప్​ లాంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. కొన్నాళ్లపాటు సుశాంత్​ పీఆర్వోగా వ్యవహరించింది.  ఆమె తండ్రి ఓ వ్యాపారవేత్త. టీవీ యాక్టర్​ రోహన్​ రాయ్​తో ఆమెకు ఎంగేజ్​మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా సుశాంత్ సింగ్ రాజ్​పుత్​పై వరల్డ్​ రికార్డు స్థాయిలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. జస్టిస్​ ఫర్​ సుశాంత్ పేరుతో వారంలో కనీసం మూడు రోజులైనా ట్వీట్లతో ఫ్యాన్స్​ హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో సింపథీతో దిశా కోసం కూడా ఉద్యమిస్తున్నారు. మే 26న ఆమె పుట్టినరోజుకాగా.. ఆ రోజును ఏకంగా దిశ దినోత్సవంగా ట్విట్టర్​లో జరిపారు కూడా. చదవండి: సుశాంత్​కి పట్టిన గతే పడుతుంది

మరిన్ని వార్తలు