Kinnerasani Movie Review: కిన్నెరసాని రివ్యూ

10 Jun, 2022 16:07 IST|Sakshi

టైటిల్‌: కిన్నెరసాని
జానర్‌: మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌
నటీనటులు: కల్యాణ్‌ దేవ్‌, అన్‌ షీతల్‌, రవీంద్ర విజయ్‌, సత్య ప్రకాష్‌, మహతి
దర్శకుడు: రమణ తేజ
నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రవి చింతల
సంగీతం: మహతి స్వర సాగర్‌
సినిమాటోగ్రఫీ: దినేశ్‌ కె.బాబు
విడుదల తేది: జూన్‌ 10, 2022 (జీ5)

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ నటించిన తాజా సినిమా కిన్నెరసాని. మొదట ఈ మూవీని థియేటర్‌లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ గత చిత్రం సూపర్‌మచ్చి థియేటర్‌లో పెద్దగా ఆడకపోవడంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేశారు. 'అశ్వథ్థామ' ఫేమ్‌ రమణతేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(జూన్‌ 10) జీ 5లో రిలీజైంది. మరి కిన్నెరసాని చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం..

కథ:
వెంకట్‌(కల్యాణ్‌ దేవ్‌) తెలివైన లాయర్‌. ఎంతో ఈజీగా కేసులను పరిష్కరిస్తాడు. కాలేజీ టైంలోనే ఓ అమ్మాయి(కాశిష్‌ ఖాన్‌)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో ఆమె చనిపోతుంది. వేద(అన్‌ షీతల్‌) లైబ్రరీ నడుపుతుంది. లైబ్రరీలో తనకు దొరికిన కిన్నెరసాని పుస్తకం తన జీవితమే అని తెలుసుకుంటుంది. అందులో తన తండ్రి జయదేవ్‌(రవీంద్ర విజయ్‌) చిన్నప్పుడే తనను చంపాలనుకున్నాడని రాసి ఉంటుంది. అయితే అసలు తనను ఎందుకు చంపాలనుకున్నాడో తండ్రినే అడిగి తెలుసుకోవాలనుకుంటుంది వేద. అతడి జాడ కోసం అన్వేషిస్తుంది. ఆమెకు వెంకట్‌ సాయం చేస్తుంటాడు. అసలు వేదకు, వెంకట్‌కు ఉన్న సంబంధం ఏంటి? వెంకట్‌ ప్రేయసిని ఎవరు చంపారు? వేదను తండ్రి ఎందుకు చంపాలనుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ
మర్డర్‌ సీన్‌తో మొదలైన సినిమా మర్డర్‌ సన్నివేశంతోనే ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో కథను సస్పెన్స్‌, ట్విస్టులతో నడిపించారు. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌లతో కొంత థ్రిల్‌ మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. రొటీన్‌ స్టోరీ కావడంతో సినిమా ఫ్రెష్‌గా ఏమీ అనిపించదు. చివర్లో క్లైమాక్స్‌ పెద్దగా వర్కవుట్‌ అవలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌ మీద కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. సాయి తేజ దేశరాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా ఉన్నాయి. కథనం ప్రేక్షకుడ్ని చివరిదాకా కట్టిపడేస్తుంది. ఉత్కంఠగా సాగిన కథనం సినిమాకి మేజర్ హైలైట్. రైటర్‌కు మంచి మార్కులు పడ్డాయి. మర్డర్‌ మిస్టరీ జానర్‌ కాబట్టి కామెడీ, కమర్షియల్‌ హంగులకి జోలికి పోలేదు.

ఎదుటివారి కళ్లలోకి కొన్ని క్షణాలు చూసి వారి మనసులో ఏముందో చెప్పగలిగే అరుదైన లక్షణం ఉన్న వేద పాత్రను మరింత అద్భుతంగా మలచడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. ఆ లక్షణం కారణంగానే బాల్యం ఛిద్రమైందని చూపించిన దర్శకుడు ఆ రేర్‌ క్వాలిటీని ఎక్కువగా హైలైట్‌ చేయకపోవడం, దాన్ని లైట్‌ తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.

నటన పరంగా కల్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కల్యాణ్‌ కొంచెం కొత్తగా కనిపించాడు. అతడి ప్రేయసిగా నటించిన కాశీష్‌ ఖాన్‌ నిడివి తక్కువే అయినా ఆమె పాత్ర ఎంతో కీలకం. స్క్రీన్‌పై కనిపించే కొద్ది నిమిషాలు కూడా మోడ్రన్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అన్‌ షీతల్‌ తన పాత్రకు తగ్గట్లుగా నటించింది. రవీంద్ర విజయ్‌ కళ్లతోనే విలనిజం పండించాడు.

చివరగా.. నిదానంగా ముందుకు సాగిన ఈ మూవీ థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే నచ్చుతుంది.

చదవండి: తమన్నా-సత్యదేవ్‌ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే!
అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు

Poll
Loading...
మరిన్ని వార్తలు