Priya Bhavani Shankar: డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా, ఆ భయం లేదు: హీరోయిన్‌

19 Jan, 2023 09:37 IST|Sakshi

డబ్బు సంపాదించడం కోసమే నటించడానికి వచ్చానని నటి ప్రియా భవానీ శంకర్‌ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన సంగతి తెలిసిందే. మేయాదమానే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాభవానీశంకర్‌ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎస్‌జే.సూర్య సరసన మాన్‌స్టర్, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, అరుణ్‌విజయ్‌తో మాఫియా,ధనుష్‌తో తిరుచ్చిట్రంఫలం వంటి చిత్రాల్లో నటించి ప్రాచుర్యం పొందింది.

ప్రస్తుతం రుద్రన్, డిమాంటీ కాలనీ- 2, ఇండియన్‌-2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన కల్యాణం.. కమనీయం అనే తెలుగు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న తెరపైకి వచ్చింది. మరో తెలుగు చిత్రం కూడా చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియాభవానిశంకర్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సహజత్వంతో కూడిన కథా చిత్రాలంటే తనకు ఇష్టం అని చెప్పింది. ఇటీవల తమిళంలో ధనుష్‌కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించానని చెప్పారు.

నటించడానికి వచ్చినప్పుడు భవిష్యత్‌ గురించి ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పింది. ప్రేక్షకులు తనను ఆదరిస్తారా, లేదా అని భయపడలేదని చెప్పింది. నటిస్తే డబ్బు వస్తుంది అనే భావించానని, అందుకే నటించడానికి వచ్చానని పేర్కొంది. ఇటీవలే  తెలుగులోనూ నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. సినీ నేపథ్యం కలిగిన వారే తామేంటో నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారని, దీంతో తాను ఇంకా ఎక్కువగా శ్రమించాలని భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ప్రియాభవానీశంకర్‌ పేర్కొంది.  

మరిన్ని వార్తలు