విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు మంగళవారం కమల్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కుడి కాలు ఎముకకు స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా కమల్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వివరించారు. దీంతో ఆయన కాలికి సర్జరీ చేశామన్నారు.
ప్రస్తుతం కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. కమల్ కోలుకుంటున్నారని మరో 4, 5 రోజుల్లో డిశ్చార్జీ కానున్నారని వైద్యులు తెలిపారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కమలహాసన్ కొన్ని నెలలుగా ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన ఆయన తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కమల్ ప్రణాళిక వేసి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం.