Kangana Ranaut: చంపేస్తామని బెదిరిస్తున్నారు

1 Dec, 2021 07:02 IST|Sakshi

ముంబై: సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన తన అభిప్రాయాలను కొందరు తీవ్రంగా వ్యతిరేకించి, చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మంగళవారం వెల్లడించారు. ఈ తరహా హెచ్చరికలు ఎక్కువైపోయాయని, చర్యలు తీసుకోండంటూ పంజాబ్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పంజాబ్‌లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సంబంధిత ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని కంగన తన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా. తుక్డే తుక్డే గ్యాంగ్‌లనూ విమర్శిస్తా. విదేశాల్లో కూర్చుని భారత్‌లో ఖలిస్తాన్‌ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతా. అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్‌లో బహిరంగంగా ప్రకటించాడు ’ అని కంగనా పోస్ట్‌చేశారు. ‘ సోనియా గాంధీజీ మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిర గాంధీ ఇదే ఉగ్రవాదులపై తుదిశ్వాస వరకూ పోరాడారు. నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌లోని మీ(కాంగ్రెస్‌) ముఖ్యమంత్రికి సూచించండి’ అని కంగన విజ్ఞప్తిచేశారు.   

మరిన్ని వార్తలు