అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆరోపణలపై స్పందించిన కంగనా

8 Sep, 2020 18:23 IST|Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు నటి కంగనా రనౌత్‌. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కంగనా డ్రగ్స్‌ తీసుకుంటారని ఆరోపించారు. అధ్యాయన్ సుమన్‌తో తనకు సంబంధాలున్నాయని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, అతడిని కూడా బలవంతం చేసినట్లు ఒక ఇంటర్యూలో కంగనా చెప్పారని అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారని అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీల్ ప్రభు అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. దాంతో కంగనా దీనిపై స్పందించారు. ఈ క్రమంలో తాను డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతానని సవాలు చేశారు కంగనా రనౌత్. (చదవండి: ‘క్వీన్‌’కు కేంద్రం రక్షణ! )

డ్రగ్స్ పరీక్షకు తాను సిద్ధమే అన్నారు కంగనా. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబై పోలీసుల ఆదేశాలను తాను సంతోషంగా స్వీకరిస్తానన్నారు. తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని, తన ఫోన్ కాల్స్ రికార్డులు పరిశీలించి డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధాలున్నట్లు ఆధారాలు చూపాలన్నారు కంగనా. అలా చేస్తే తన తప్పును ఒప్పుకుని ముంబైని శాశ్వతంగా వదిలిపోతానని చెప్పారు. దీని కోసం మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నానంటూ మంగళవారం ట్వీట్ చేశారు కంగనా. దీన్ని నిరూపిస్తే ముంబైని శాశ్వతంగా వీడుతానని చెప్పారు.

>
మరిన్ని వార్తలు