సంజయ్‌ రౌత్‌ బాహాటంగా బెదిరించారు

3 Sep, 2020 16:07 IST|Sakshi

శివసేన నేత హెచ్చరికపై స్పందించిన క్వీన్‌

ముంబై : బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టవద్దని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనను బహిరంగంగా బెదిరించడంపై కంగనా రనౌత్‌ స్పందించారు. సంజయ్‌ రౌత్‌ బెదిరింపుల నేపథ్యంలో ముంబై నగరం తనకు ఇప్పుడు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై పార్టీ పత్రిక సామ్నాలో సంజయ్‌ రౌత్‌ ఎండగట్టారు. ముంబై నగరంలో ఉంటూనే ముంబై పోలీసులపై కంగనా సందేహం వ్యక్తం చేస్తున్నారని తప్పుపట్టారు. చదవండి : కంగనా సంచలన వ్యాఖ్యలు

ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, దయచేసి ఆమెను ముంబై రావద్దని కోరుతున్నామని సామ్నాలో ఆయన రాసుకొచ్చారు. దీనిపై హోం శాఖ చర్యలు తీసుకోవాలని రౌత్‌ పేర్కొన్నారు. సుశాంత్‌ మృతి కేసుపై ముంబై పోలీసుల పనితీరును గతంలోనూ పలుమార్లు కంగనా ప్రశ్నించారు. సుశాంత్‌ మరణించిన అనంతరం బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఇతరులతో పోలిస్తే స్టార్‌ కిడ్స్‌ను ప్రోత్సహించే సంస్కృతిపై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడకం మామూలేనని కంగనా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. నార్కోటిక్స్‌ బ్యూరో విచారణ చేపడితే బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు జైలు ఊచలులెక్కపెడతారని ఆమె వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు