మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్‌ క్వీన్‌

23 Feb, 2021 22:05 IST|Sakshi

హిందీ సినీ పరిశ్రమలో క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్‌ వ్యాపార రంగంలోకి దిగారు. అది కూడా మంచుకొండల్లో సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది. తను పుట్టిన రాష్ట్రంలో తన కలను సాకారం చేసుకోనుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కేఫ్‌, రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తన కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్‌ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్‌కు చెందిన కంగనా రనౌత్‌ మహారాష్ట్రకు వచ్చి హిందీ సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. క్వీన్‌గా మారేందుకు చాలా కష్టాలు పడింది.

ఇప్పుడు బాలీవుడ్‌ ఐకాన్‌గా నిలుస్తోంది. ఎన్నో సినిమాలు, అవార్డులు పొందిన ఆనందం కన్నా తాను కలలు కన్న ప్రాజెక్టు ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొంది. ‘నా కలను నెరవేర్చుకోతున్న విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. నాకు సినిమాల తర్వాత ఎంతో ఇష్టమైన రంగం హోటల్‌ రంగం. ఈ రంగంలో తొలి అడుగు పడింది. మనాలీలో నా తొలి కేఫ్‌, రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నా. అందంగా తీర్చిదిద్దుతున్న నా బృందానికి కృతజ్ఞతలు’ అని కంగనా ఫొటోలు పంచుకుంటూ షేర్‌ చేసింది.
 

మరిన్ని వార్తలు