Kangana Ranaut: ఫైర్‌బ్రాండ్‌కు షాకిచ్చిన ట్విటర్‌

4 May, 2021 13:28 IST|Sakshi

ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉండే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు ఈసారి ట్విటర్‌ గట్టి షాకే ఇచ్చింది. ఏకంగా ఆమె అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తీవ్రస్థాయిలో హింస జరుగుతోందంటూ ఆమె పలు వీడియోలను, సందేశాలను అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలనకు ఆదేశించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపడంతో ట్విటర్‌ ఆమె ఖాతాను నిలిపివేసింది. ఊహించని చర్యతో ఖంగు తిన్న కంగనా కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతిపెట్టడమేనని విమర్శించింది.

ఇక ఈ మధ్య కంగనా చేసిన మరో ట్వీటు సైతం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అప్పుడు చెట్లు నరికేసి ఇప్పుడేమో ఆక్సిజన్‌ కోసం వెంపర్లాడుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడింది. దీంతో కరోనా కష్ట సమయంలో ఇలాంటి మాటలు సబబు కాదంటూ పలువురు ఆమె వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు.

ఇదిలా వుంటే 'మణికర్ణిక' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె డిజిటల్‌ మీడియాలో నిర్మాతగా అడుగులు వేస్తోంది. మణికర్ణిక ఫిల్మ్స్‌ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆమె టికు వెడ్స్‌ షేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరెక్కించనుంది. ప్రస్తుతం ఆమె హిందీలో ధాకడ్‌, తేజస్‌ సినిమాల్లో నటిస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన తలైవి సినిమాలోనూ నటించగా ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

చదవండి: ఓటీటీలో రానున్న తలైవి!: క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

>
మరిన్ని వార్తలు