తలైవి పాత్రలో ఒదిగిపోయిన కంగనా

11 Oct, 2020 13:24 IST|Sakshi

హైదరాబాద్‌: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి' షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత ఆరునెలల నుంచి షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న 'తలైవి' చిత్రం ఆదివారం తిరిగి షూటింగ్‌ను ప్రారంభించినట్లు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా ఫైర్‌ బ్రాండ్‌ కంగనా.. 'జయ మా ఆశీస్సులతో 'తలైవి' మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ యాక్షన్‌, కట్‌ చెప్పే విధానం ఏ మాత్రం మారలేదు' అంటూ పేర్కొంది. తలైవి షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఫొటోలు వైరల్‌ అవుతూ వచ్చాయి. అయితే తాజాగా.. కంగనా జయలలిత పాత్రలో అసెంబ్లీకి వస్తున్న ఫొటోలు, అసెంబ్లీలో కూర్చున్న ఫొటోలను షేర్‌ చేసింది. ఇందులో కంగనా జయలలిత పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలైవి విడుదల తేదీని మూవీ యాజమాన్యం త్వరలో ప్రకటించనుంది. కాగా కంగనా జయలలిత బయోపిక్ కాకుండా, ఎయిర్ ఫోర్స్ మూవీ తేజస్‌లో కూడా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.  (వివాదాస్పద ట్వీట్ : కంగనాకు కోర్టు ఝలక్)
 

మరిన్ని వార్తలు