ఇప్పటివరకు ఆరుగురికి అంత్యక్రియలు నిర్వహించా : నటుడు

30 Apr, 2021 15:16 IST|Sakshi

బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్‌, ప్రియాంక చోప్రా, ఆలియాభట్‌, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా అంబులెన్స్‌ను స్వయంగా నడుపుతూ పలువురు కోవిడ్‌ రోగులకు సహాయం అందించాడు.

ఈ సందర్భంగా అర్జున్ గౌడ మాట్లాడుతూ..తాను ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’..అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్‌ రోగులను హాస్పిటల్స్‌కు తరలించడం సహా కోవిడ్‌ కారణంగా చనిపోయినవారికి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తుందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తానే స్వయంగా ఆరుగురికి అంత్యక్రియలు జరిపించానని వెల్లడించాడు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మతానికి చెందిన వారు అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేస్తానని తెలిపాడు.

ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రానున్ను రెండు నెలల వరకు ఈ ఆంబులెన్స్‌ సర్వీసులు కొనసాగించాలని యోచిస్తున్నట్లు వివరించాడు. తనకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని చెప్పాడు. ‘యువరత్న’, ‘రుస్తుమ్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన అర్జున్ గౌడ చేస్తోన్న మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ అర్జున్ గౌడను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

చదవండి : ఐసీయూలో కరీనా కపూర్‌ తండ్రి రణదీర్‌
KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు