కన్నడ నటుడు వినాయక్‌ వివాహం

29 Aug, 2020 14:36 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు వినాయక్‌ జోషి ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు వర్షా బెలవాడితో ఆర్య సమాజం ఆచారాల ప్రకారం పరస్పరం ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక శుక్రవారం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలన పాటిస్తూ నిరాడంబరంగా వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లి కార్యక్రమాన్ని బంధువులు, స్నేహితులు, అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వినాయక్‌ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు వినాయక్‌, వర్షాలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షా బెలవాడి జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. ఆమె అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహిం​చారు. ప్రస్తుతం వర్షా బాడ్మింటన్‌ అకాడమీకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

వినాయక్, వర్షా చిన్ననాటి స్నేహితులు. ఏడేళ్ల వయసులో వీరిద్దరు ఒకే చోట డాన్స్‌ నేర్చుకున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మళ్లీ కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఇక సినిమాలో విషయానికి వస్తే.. హీరో వినాయక్‌ 70 సినిమాల్లో నటించారు. అమృతా వర్షిని, లాలి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. అదే విధంగా బిగ్ బాస్ కన్నడ సీజన్3లో వినాయక్‌ పాల్గొని సందడి చేశారు.

మరిన్ని వార్తలు