Koffee With Karan Show: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు

24 Aug, 2022 16:40 IST|Sakshi

కాఫీ విత్‌ కరణ్‌.. వెండితెర సెలబ్రిటీలను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసే షో. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్‌ రన్‌ అవుతోంది. ఎంతోమంది గొప్పగొప్ప సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్న ఈ షోలో ఇద్దరు మాత్రం ఎప్పటికీ రారని బల్ల గుద్ది చెప్తున్నాడు హోస్ట్‌ కరణ్‌ జోహార్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను నా షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా అభ్యర్థించాను. గతంలోనే కాదు, ఈ మధ్య కూడా అడిగా. తను ఎలాగైనా నా షోలో కనబడాలనుకున్నాను. కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.

అంటే తను ఏదో పెద్ద రహస్యం దాస్తుందనీ, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అయినా తను ససేమీరా నో చెప్పింది కాబట్టి ఇకపై ఎప్పుడూ ఆమెను రమ్మని ఆహ్వానించను. అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా రమ్మని చెప్పను. ఎందుకంటే తనపై ప్రశ్నలు కురిపించేటంత తెలివితేటలు నాకు లేవు. కాబట్టి బహుశా వీళ్లిద్దరూ నా షోలో కనిపించకపోవచ్చు' అని చెప్పుకొచ్చాడు కరణ్‌.

కాగా 2005లో కాఫీ విత్‌ కరణ్‌ తొలిసారిగా టీవీలో ప్రసారమైంది. అయితే ఏడో సీజన్‌ మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. గత వారం విక్కీ కౌశల్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా షోలోకి విచ్చేయగా ఈ వారం షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ రానున్నారు.

చదవండి: త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా? ఆమె తల్లి ఏమందంటే?
మళ్లీ కరోనా బారిన అమితాబ్‌, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి..

మరిన్ని వార్తలు