Karan Johar: వసూళ్లు రాబట్టినా.. ఆ సినిమాతో భారీ నష్టం: కరణ్ జోహార్

13 Jan, 2023 18:25 IST|Sakshi

బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. 

కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.

అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్‌లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్‌తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో  ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు.

కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లు

కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్‌, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

మరిన్ని వార్తలు