‘పెద్దింటి’కి సినీ స్వర్ణ కమలం అవార్డు

6 Jul, 2021 14:47 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, సినీరచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణ కమలం అవార్డు లభించింది. సినిమా రంగంలో ప్రతిభావంతులకు ఇచ్చే ఈ అవార్డును ఉత్తమ రచయిత విభాగంలో 2020 సంవత్సరానికిగాను పెద్దింటి అశోక్‌కుమార్‌కు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ సభ్యులు సీవీఎల్‌ నరసింహరావు ప్రకటించారు. కథకుడిగా తెలంగాణ భాష, యాసలపై పట్టుకున్న ‘పెద్దింటి’ పది సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆయన మాటలు, పాటలు రాసిన ‘మల్లేశం’ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ప్రస్తుతం అశోక్‌కుమార్‌ ముగ్గురు ప్రముఖ అగ్రహీరోల సినిమాలకు మాటల రచయితగా పనిచేస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అశోక్‌కుమార్‌ రాసిన జిగిరి నవల ఆధారంగా హాలీవుడ్‌ హంగులతో సిని మాగా రూపొందుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం సిరిసిల్లలో స్థిరపడిన అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణకమలం అవార్డు రావడంపై పలువురు ఆయన్ని అభినందించారు. 

మరిన్ని వార్తలు