పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం

17 Nov, 2021 11:12 IST|Sakshi

Karnataka CM Announce Karnataka Ratna Award To Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించినవి మొత్తం 29 చిత్రాలే అయినా తన మరణాన్ని జీర్ణించుకోలేని తన అభిమానులు 21 మంది గుండెలు ఆగిపోయాయి. తన సినిమాలకంటే కూడా పునీత్‌ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు తనకు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్‌ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్‌. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కర్ణాటకలో ఆయన నామస్మరణ జరుగుతుంది.

ప్రతి రోజూ లక్షలాది మంది వచ్చి పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించుకుంటున్నారు. అంతే కాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమ జంటలు ఆయన సమాధి దగ్గర పెళ్లి చేసుకుంటున్నారంటే కర్ణాటకలో పునీత్ పేరు ప్రఖ్యాతులు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పునీత్ ఉన్నా లేకపోయినా తను చేస్తున్న సేవా కార్యక్రమాలు మాత్రం ఆగకూడదని కొన్నేళ్ల కిందే తన ట్రస్టులో 8 కోట్లు ఫిక్స్డ్‌ డిపాజిట్ చేశాడు. దీని తర్వాత అక్కడి ప్రజలకు పునీత్‌పై అభిమానం మరింత పెరిగింది. ఇలాంటి మంచి మనిషిని దేవుడు ఎందుకు ఇంత చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయాడు అంటూ కన్నడిగులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం పునీత్‌కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. అత్యుత్తమ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల అభిమానం పొందిన అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చే పురస్కారం కర్ణాటక రత్న. ఇది కన్నడిగులకు మాత్రమే ఇచ్చే పురస్కారం అని తెలుస్తుంది. అయితే దీనితో పాటు పునీత్‌కు బసవ శ్రీ బిరుదు కూడా ఇవ్వాలని అభిమానులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. దాని గురించి కూడా ఆలోచిస్తామని ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు