ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు: డైరెక్టర్‌

5 Aug, 2022 11:18 IST|Sakshi

నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమన్‌. ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ కథానాయికగా పరిచయం అవుతున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, ఎస్‌.కె.సెల్వకుమార్‌ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి మధురైలో చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్‌ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. సీనియర్‌ దర్శకుడు భారతీరాజా, రాజ్యసభ సభ్యుడు వెంకటేశన్‌ అతిథులుగా పాల్గొన్నారు.

దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన ఏ చిత్రానికీ ఆడియో విడుదల వేడుక జరగలేదన్నారు. కానీ ఈసారి ఇలా వేడుక జరిపినందుకు సూర్య, జ్యోతిక, కార్తీ, 2డీ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కథానాయికగా అవకాశం ఇచ్చిన సూర్య, కార్తీకి హీరోయిన్‌ అదితి శంకర్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఆమె ఈ చిత్రంలో ఒక పాట పాడటం విశేషం. కార్తీ మాట్లాడుతూ తన తొలి చిత్రం పరుత్తివీరన్‌ షూటింగ్‌ ఇక్కడే జరిగిందన్నారు. ఇంతకుముందు ముత్తయ్య దర్శకత్వంలో మధురై నేపథ్యంలో కొంబన్‌ చిత్రంలో నటించానని, ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. రెండవసారి విరుమన్‌ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.

సూర్య మాట్లాడుతూ మధురై మన్నులో కథలకు కొరతే లేదన్నారు. పలుమార్లు ఇక్కడికి వచ్చి ప్రేమాభిమానాలను పొందానన్నారు. అలాంటి ఈ గడ్డపై విరుమన్‌ చిత్ర ఆడియో వేడుక జరపడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఇక్కడ కథల్లో జీవం ఉంటుందన్నారు. కార్తీ నా కంటే మంచి నటుడు అని కొనియాడారు. ఆదితి శంకర్‌ నటిగా మెప్పించారన్నారు. తనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలో తాను తన పిల్లల విద్య విషయమై న్యూయార్క్‌లో ఉన్నానని, ఆ విషయం తెలియడానికి తనకు నాలుగు గంటలు పట్టిందన్నారు. అంతకు ముందే మీడియా ఆ వార్తను గ్లోబలైజేషన్‌ చేయడం సంతోషం కలిగించిందని తెలిపారు.

చదవండి: విజయ్‌ దేవరకొండతో లవ్‌? మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక
ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు! 

మరిన్ని వార్తలు