జై సుల్తాన్‌ అంటున్నారు!

5 Apr, 2021 01:13 IST|Sakshi
భాగ్యరాజ్‌ కణ్ణన్, వరంగల్‌ శ్రీను, కార్తీ, ఎస్‌ఆర్‌ ప్రభు, రాకేందు మౌళి

– కార్తీ

‘‘చాలా రోజుల తర్వాత ‘సుల్తాన్‌’ వంటి మాస్‌ సినిమా చేశా. కుటుంబ ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. మహిళా ప్రేక్షకులు ఫైట్స్‌ బాగున్నాయని అంటుంటే, పిల్లలు మాత్రం ‘జై సుల్తాన్‌’ అంటున్నారు. తెలుగులో నా కెరీర్‌లో ‘సుల్తాన్‌’ సినిమాకి బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని హీరో కార్తీ అన్నారు. భాగ్యరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్‌’. యస్‌.ఆర్‌. ప్రకాష్‌ బాబు, యస్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు. ఈ సినిమాని తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్‌ ద్వారా వరంగల్‌ శ్రీను ఏప్రిల్‌ 2న విడుదల చేశారు.

హైదారాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్తీ మాట్లాడుతూ– ‘‘వంద మంది రౌడీలను మంచివారిగా మార్చడమే ఈ సినిమా.. వారిని మార్చే క్రమంలో వ్యవసాయం చేస్తే ఎవ్వరి దగ్గరా పని చేయాల్సిన అవసరం లేదనే పాయింట్‌ ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్‌ అయ్యింది. మా అన్నయ్య (సూర్య), వదిన (జ్యోతిక) సినిమా చూసి.. 100 మందిని ఎలా మేనేజ్‌ చేశారు? అని అడిగారు. ఈ సినిమాని థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘సుల్తాన్‌’ సినిమా వెనక ఎస్‌ఆర్‌ ప్రభు, భాగ్యరాజ్, కార్తీ వంటి ముగ్గురు సుల్తాన్‌లు ఉన్నారు. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు వరంగల్‌ శ్రీను. ‘‘సుల్తాన్‌ సినిమాకి మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీ’’ అన్నారు నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు. ‘‘సుల్తాన్‌’ కి తమిళ్‌లో, తెలుగులో చాలా మంచి స్పందన వస్తోంది’’ అన్నారు భాగ్యరాజ్‌ కణ్ణన్‌. ‘‘ఈ సినిమాలో డైలాగులు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలా ఉన్నాయంటుంటే హ్యాపీ’’ అన్నారు మాటల రచయిత రాకేందు మౌళి.

మరిన్ని వార్తలు