Karthikeya: కార్తీకేయతో జతకట్టిన ‘డీజే టిల్లు’ హీరోయిన్‌, ప్రారంభమైన సినిమా

23 Apr, 2022 08:07 IST|Sakshi

Karthikeya and Neha Shetty Movie Launch: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి జంటగా క్లాక్స్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘కలర్‌ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ వంటి చిత్రాలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి.యువరాజ్‌ సమర్పిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజకార్యక్రమాన్ని జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచాన్‌ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్‌ ఇచ్చారు. ‘ఉప్పెన’ ఫేమ్‌ దర్శకుడు సానా బుచ్చిబాబు స్క్రిప్ట్‌ అందించారు.

ఈ సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం. దివంగత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు మా చిత్రంలో ఒక పాట రాశారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది. కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టు జీవించే ఓ యువకుడి కథ ఇది’’ అని క్లాక్స్‌ అన్నారు. ఈ చిత్రానికి  సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు