సాక్షి ట్వీట్‌తో కత్తి మహేశ్‌ ఘటనపై విచారణ జరిపాం: సీఐ రామకృష్ణారెడ్డి

14 Jul, 2021 17:59 IST|Sakshi

సినీ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొవ్వూరు సీఐ ప్రమాదంలో కత్తి మహేశ్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్న సురేశ్‌ను పిలిచి విచారించారు. ఈ విచారణలో డ్రైవర్‌ ప్రమాదం జరిగిన తీరును ఇలా వివరించాడు. నిద్ర సమయం కావటంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని, ఆ లోపే ఈ ఘటన జరిగిందన్నాడు. కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాడు.

ప్రమాదం సమయంలో కత్తి మహేశ్‌ నిద్రలో ఉన్నారని, సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడినట్లుగా సురేశ్‌ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్‌ కంటికి గుచ్చుకున్నాయని అన్నాడు. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్‌ పోలీసుల సాయంతో మహేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు. అయితే అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామని తెలిపాడు. మరీ ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగడంతో తను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్‌ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

ఈ విచారణ అనంతరం సురేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని సురేశ్‌ పేర్కొన్నాడు. ఇక సీఐ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ట్వీట్‌తో మహేశ్‌ ప్రమాద ఘటనపై విచారణ జరిపాం అన్నారు. ఈ మేరకు కారు నడిపిన సురేశ్‌ను పిలిచి విచారించామని, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు