కేబీసీ12 సీజన్‌ 25 లక్షల ప్రశ్న.. ఆన్సర్‌ చెప్పండి

3 Oct, 2020 15:10 IST|Sakshi

కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) షోకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్‌ సక్సెస్‌ సాధించడంతో ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ కార్యక్రమం వస్తుంది. ఇక ఈ షో సక్సెస్‌కు ప్రధాన కారణం అమితాబ్‌ బచ్చన్‌ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. హాట్‌ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌ని, ఇటు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తారు బిగ్‌ బీ. ఇక మన దగ్గర ఈ షోకు నాగార్జున, చిరంజీవి యాంకరింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కేబీసీ 12వ సీజన్‌ టెలికాస్ట్‌ అవుతంది. సోమ వారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో ప్రసారం అవుతుంది. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో 12.5లక్షల రూపాయలతో వెళ్లి పోవాల్సి వచ్చింది. ఇక మరి నిన్నటి ఎపిసోడ్‌ కంటెస్టెంట్‌ ఎవరు.. లైఫ్‌లైన్స్‌ని ఏ ప్రశ్నలకు వాడుకుందో చూడండి. గురువారానికి పొడిగింపుగా జరగిన శుక్రవారం నాటి షోలో ఢిల్లీకి చెందిన ట్యాక్స్‌ ఆఫీసర్‌ తనీషా అగర్వల్‌ కంటెస్టెంట్‌గా కొనసాగారు. గురువారం నాటికే ఈమె 40వేల రూపాయలు సంపాదించారు. (చదవండి: కేబీసీ కరమ్‌వీర్‌లో అచ్యుత సామంత)

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో తనీషా తన మొదటి లైఫ్‌లైన్‌ 50-50ని 1.6లక్షల రుపాయల ప్రశ్న కోసం వాడుకున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే ‘మల్‌ గుజారీ అనేది ఏ రకమైనా ట్యాక్స్‌ ’.. ఇక ఆప్షన్స్‌ వచ్చి ఎక్సైజ్‌, ఇన్‌కమ్‌, ల్యాండ్‌ రెవిన్యూ, వెల్త్‌ ట్యాక్స్‌.  కరెక్ట్‌ ఆన్సర్‌ ల్యాండ్‌ రెవిన్యూ. ఇక రెండో లైఫ్‌లైన్‌ ‘ఆస్క్‌ ద ఎక్స్‌పర్ట్‌’ని 10 ప్రశ్న కోసం వినియోగించుకున్నారు. ఈ ప్రశ్న విలువ 3.2లక్షల రూపాయలు. ‘హిందూ మత గ్రంథాల ప్రకారం, కృష్ణుని సన్నిహితుడు, బృందావన్‌కు తన దూతగా పంపబడినది ఎవరు?’ అనేది ప్రశ్న. సరైన సమాధానం: ఉద్ధవ్‌.. ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్‌ భూపేశ్, ఉద్దవ్, నవీన్, అశోక్. ఇక తరువాతి ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత 12వ ప్రశ్నకు చివరి లైఫ్‌ లైన్‌ ‘వీడియో ఏ ఫ్రెండ్‌’ని వినియోగించుకుంది. ఈ సారి తనీషా ఫ్రెండ్‌ ఆమెకు సాయం చేశారు. 12.5లక్షల రూపాయల విలువైన 12వ ప్రశ్న ఏంటంటే.. చిన్నతంలోనే పోలియో సోకినప్పటికి 1960 ఒలంపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన అథ్లెట్‌ ఎవరు?.. కరెక్ట్‌ సమాధానం విల్మా రుడాల్ఫ్‌. (చదవండి: ఆర్‌బీఐ ప్రచార కార్యక్రమాల్లో బిగ్‌బీ)

ఇక్కడితో అన్ని లైఫ్‌లైన్‌లు అయిపోయాయి. ఇక తరువాతి ప్రశ్నలకు తనీషా సమాధానం చెప్పాలి​. కరెక్ట్‌ అయితే ముందుకు వెళ్తుంది.. లేదంటే క్విట్‌ చెప్పాలి. తనీషా అగర్వాల్ 25 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్‌ చెప్పింది. దాంతో 12.5లక్షల రూపాయలతో ఇంటికి వెళ్లింది. ఇక 25లక్షల రూపాయల విలువ చేసే ఆ 13వ ప్రశ్న ఏంటంటే.. ‘ఈ స్వాతంత్ర్య సమరయోధులలో రెండు భాగాలుగా వచ్చిన పుస్తకం ‘ది ఇండియన్ స్ట్రగుల్ 1920-1942’ రచయిత ఎవరు?’ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్‌ ఏంటంటే.. బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాస్ చంద్రబోస్, కెప్టెన్ లక్ష్మి సెహగల్. మీకు సమాధానం తెలుసా.. ట్రై చేయండి. తెలియదా.. సరైన సమాధానం: నేతాజీ సుభాస్ చంద్రబోస్. ఆన్సర్‌ తెలియకపోవడంతో తనీషా 12.5లక్షల రూపాయలతో గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యింది. (చదవండి: బిగ్ ‌బీకి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన ఫ్యాన్‌)

ఇక తనీషా తరువాత హాట్‌ సీటులో కూర్చోబోయేది ఎవరు అంటే వలస కార్మికులతో కలిసి పనిచేసే లాభాపేక్షలేని సంస్థ అజీవికా బ్యూరో వ్యవస్థాపకులు రాజీవ్ ఖండేల్వాల్, కృష్ణవతార్ శర్మ. వీరిద్దరూ 2005 లో ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వలస కార్మికులతో కలిసి పనిచేశారు.

మరిన్ని వార్తలు