Keerthy Suresh: రెమ్యునరేషన్‌ లెక్కలు బయటపెట్టిన కీర్తి

16 Jul, 2022 09:16 IST|Sakshi

పారితోషికం పెంచలేదని అంటోంది కీర్తి సురేష్‌. కొన్ని చిత్రాలకు తగ్గించే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నానని అంటోంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలో నటి కీర్తీసురేశ్‌కు అంటూ కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఇటీవల మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి విజయాన్ని సాధించింది. ఇందులో గ్లామర్‌ పాత్రను పోషించారు. తాజాగా తమిళంలో సాని కాగితం చిత్రంలో డీగ్లామర్‌ పాత్రలో జీవించారు. మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీసురేశ్‌ ముచ్చట్లు చూద్దాం..

సాని కాగితం చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో నటించించిన అనుభవం గురించి? 
ఆయన ఒక దర్శకుడు అయినా, నటుడిగానే చూశాను. సెల్వరాఘవన్‌ కూడా దర్శకుడు చెప్పినట్లే నటించేవారు. ప్రతి రోజూ షూటింగ్‌ జరిగేది. ఏమీ మాట్లాడేవారు కాదు. పరిచయ నటుడిగానే నడుచుకునేవారు.

సడన్‌గా ఎలా బరువు తగ్గారు? 
మహానటి చిత్రం తరువాత 7 నెలలు ఇంటిలోనే ఉన్నాను. ఆ సమయంలో కసరత్తులతో పాటు ఆహార కట్టుబాట్లు పాటించాను. దీంతో బరువు తగ్గాను.  

సెల్వరాఘవన్, ధనుష్‌లతో నటించిన అనుభవం? 
సాని కాగితం చిత్ర ట్రైలర్‌ చూసి ధనుష్‌ ఫోన్‌ చేశారు. అప్పుడు సెల్వరాఘవన్‌ సూపర్‌గా నటిస్తున్నారు. నాకే దడ పుడుతోంది అని చెప్పాను. అవును నేను కూడా ఆయన నుంచే నటన నేర్చుకున్నాను. వేరే మాదిరి నటించి చూపుతారు అని ధనుష్‌ చెప్పారు. అన్న, తమ్ముళ్లతో నటించడం సంతోషం. 

తమిళ చిత్రాలు ఎక్కువగా నటించడం లేదే? 
తెలుగులో మహేశ్‌బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించాను. అక్కడ మరి కొన్ని చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో అన్నాత్తే చిత్రం తరువాత సాని కాగితం చేశాను. తదుపరి మామన్నన్‌ చేస్తున్నాను. తమిళం, తెలుగు అని వేరు చేసి చూడటం లేదు.

సాని కాగితం చిత్రం ఓటీటీలో విడుదలవ్వడం గురించి? 
ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయి ప్రపంచ స్థాయిలో రీచ్‌ అవ్వడంతో పలువురు చూసి ఆనందించారు. అయితే థియేటర్లలో విడుదలయితే ఇంకా బాగుండేది.

కీర్తీసురేశ్‌ పాన్‌ ఇండియా నటి అయినట్లున్నారు? 
భలే వారే. నేను తమిళం, తెలుగు, మలయాళం భాషా చిత్రాల్లోనే నటించాను. ఇంకా చాలా భాషా చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నాను. ఆ తరువాతనే పాన్‌ ఇండియా చిత్రాలు.

ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు? 
విజయ్‌సేతుపతి నటన చాలా ఇష్టం. జయంరవి, కార్తీ ఇలా చాలా నటులతో నటించాలి. అదే విధంగా దర్శకుడు మణిరత్నం, రాజమౌళి, శంకర్‌ దర్శకత్వంలో నటించాలని ఉంది.  

పారితోషికం పెంచేశారట? 
అలాంటిదేమీ లేదు. తెలుగు, తమిళం భాషల్లో ఒకే పారితోషికం తీసుకుంటున్నాను. కొన్ని సమయాల్లో పారితోషకం తగ్గించుకుంటున్నాను కూడా.

చదవండి: రామ్‌ తగ్గడం వల్లే నాకింత పేరొచ్చింది..: విలన్‌ ఆది
సుష్మితతో డేటింగ్‌, లలిత్‌ మోదీ పాత ట్వీట్‌ వైరల్‌!

మరిన్ని వార్తలు